ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 06 July 2026, 8:30 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

ట్రాన్స్ జెండర్స్ స్వయం ఉపాధితో రాణించాలి . కలెక్టర్ రాహుల్ శర్మ

జయశంకర్ భూపాలపల్లి,అర్జున్ సమాచారం:

ట్రాన్స్‌జెండర్ల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో
ఈఆర్‌ఎస్  పథకం కింద మహిళా శిశు, వయోవృ ద్దులు, ట్రాన్సజెండర్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో  ఈఆర్‌ఎస్  పథకం కింద ఎంపికైన ఒక ట్రాన్స్‌జెండర్ కు 75 వేల రూపాయల ఆర్థిక సహాయపు చెక్కును కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ… ప్రభుత్వ సహాయాన్ని సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధితో రాణించాలని సూచించారు.
సమాజంలోని అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం, ట్రాన్స్‌జెండర్‌ల సామాజిక, ఆర్థిక సాధికారతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఆయన పేర్కొన్నారు.
ట్రాన్స్‌జెండర్‌లు సమాజంలో ఎవరికీ తీసిపోకుండా గౌరవప్రదమైన జీవనం గడపాలన్నదే ప్రభుత్వ సంకల్పమని అన్నారు. వారు స్వయం ఉపాధి రంగాలలో స్థిరపడి, ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని గుర్తుచేశారు.
ప్రభుత్వం అందించిన ఈ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకుని, వ్యాపార లేదా ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవాలని లబ్ధిదారునికి సూచించారు. ట్రాన్స్‌జెండర్లు ఆర్థిక స్వావలంబన సాధించి సమాజంలో ఇతరులకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. జిల్లాలోని అర్హులైన ట్రాన్స్‌జెండర్లందరూ ప్రభుత్వం అందిస్తున్న ఇలాంటి సంక్షేమ పథకాలపై అవగాహన పెంచుకుని, సకాలంలో దరఖాస్తు చేసుకుని లబ్ధి పొందాలని కలెక్టర్ కోరారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్  విజయలక్ష్మి, జిల్లా సంక్షేమ అధికారి మల్లేశ్వరి తదితరులు పాల్గొని, లబ్ధిదారునికి శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరింత ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు.
===========================